Celebrated with Patriotic Fervour In Tirumala _ తిరుమలలో ఘనంగా ”తిరంగా” వేడుకలు
తిరుమలలో ఘనంగా ”తిరంగా” వేడుకలు
తిరుమల, 15 ఆగష్టు 2013 : తిరుమలలో 67వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు తి.తి.దే ఆధ్వర్యంలో గురువారంనాడు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరుమలలోని నిఘా మరియు భద్రతా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మువ్వన్నెల జెండాను తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు పతాకోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమనేదే స్వాతంత్ర భారతి అన్నారు. ప్రపంచ దేశాలకే సత్యాహింసలను, ధర్మనిరతిని చాటిన ఘనత ఒక్క భారతదేశానికి మాత్రమే దక్కుతుందన్నారు. గాంధి, నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్ లాంటి ఎందరో మహనీయుల చరిత్రలను గూర్చి నేటితరం విద్యార్థులు, యువత వారి జీవిత చరిత్ర పుస్తకాలను చదివి, వారి త్యాగ నిరతిని గ్రహించి దేశాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక తిరుమలకు అనుదినం విచ్చేసే వేలాదిమంది భక్తులకు రేయింబవళ్లు కష్టపడుతూ సేవలందిస్తున్న తి.తి.దే వివిధ విభాగాల సిబ్బందిని ఆయన ప్రశంసించారు. మున్ముందు కూడా మరింత ఉత్సాహంతో, అంకిత భావంతో దేశవిదేశాల నుండి విచ్చేసే భక్తులకు సేవలందించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు భద్రతా మరియు నిఘా అధికారి శ్రీ శివకూమార్ రెడ్డి, ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, కల్యాణకట్ట డిప్యూటి.ఇ.ఓ శ్రీ కృష్ణారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి శ్రీ వెంకటరమణ, ఇతర ఆధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.