HAMSA VAHANA SEVA HELD _ హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరులతల్లి
TIRUPATI, 21 NOVEMBER 2022: On the second day evening of the ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor, Goddess Sri Padmvathi Devi as Saraswathi-the Goddess of Wisdom, blessed devotees along four mada streets on Monday evening.
Both the seers of Tirumala, MP Sri Gurumurthy, JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, DyEO Sri Lokanatham and others were present.
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరులతల్లి
తిరుపతి, 2022 నవంబరు 21: కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు , కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ గురుమూర్తి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, విఎస్వోలు శ్రీ మనోహర్, శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు
శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.