ఫిబ్రవరి 28న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ

ఫిబ్రవరి 28న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ

తిరుపతి, 2019, ఫిబ్రవరి 27: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పుష్పాలంకరణలను, విద్యుత్‌ దీపాలంకరణలు పూర్తి చేశారు. అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్‌, పోలీస్‌ విభాగాలు సమన్వయంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర :

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జరుగనున్న గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుంచి లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర మధ్యాహ్నం 2.00 గంటలకు టిటిడి పరిపాలన భవనంలో ప్రారంభమవుతుంది. నగరంలోని ప్రముఖ కూడళ్ల గుండా శోభాయాత్ర సాగి శ్రీనివాసమంగాపురానికి చేరుకుంటుంది.

శ్రీఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు :

అదేవిధంగా గురువారం ఉదయం 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఇవి నగర వీధుల్లో ఊరేగింపుగా శ్రీనివాసమంగాపురానికి ఉదయం 11.00 గంటలకు చేరుకుంటుంది. శ్రీగోవిందరాజుల స్వామి ఆలయం నుంచి మంగళవాయిద్యాలు, పలువురు కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా గొవింద నామస్మరణల మధ్య స్వామివారికి అండాల్‌ మాలను తీసుకురానున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.