జూన్‌ 25 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, 2017 జూన్‌ 24: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్‌ 25 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. మెట్లోత్సవ కార్యక్రమాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి శ్రీ గోవిందరాజస్వామివారి మూడవ సత్ర ప్రాంగణములో ప్రారంభమవుతాయ.

జూన్‌ 25, 26 తేదీల్లో ఉదయం 5.00 నుండి 7.00 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 నుండి 12.00 గంటల వరకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భజన మండలి సభ్యులకు కొత్త సంకీర్తనలు నేర్పుతారు. సాయంత్రం 3.00 నుండి 6.00 గంటల వరకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలతో ధార్మిక సందేశం, హరిదాసులు మానవాళికి అందించిన ఉపదేశాలు భక్తులకు అందివ్వనున్నారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

జూన్‌ 25వ తేదీ ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశం ఇవ్వనున్నారు. జూన్‌ 27వ తేదీ మంగళవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరిలోని పాదాల మండపం వద్ద అధికార ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో విచ్చేసిన భజన మండలి సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరులను అధిరోహించి శ్రీవారిని దర్శించుకుంటారు.

పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు – శ్రీ పురందరదాసులు, శ్రీవ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయులు లాంటి ఇంకెందరో మహనీయులు భక్తి ప్రపత్తులతో సప్తగిరులను ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అటువంటివారి అడుగుజాడలలో నడిచి ఆ శ్రీనివాసుడి కృపకు పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు నిర్వహిస్తోంది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, సకల అరిష్టములు తొలగి సర్వాభీఫ్టాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.