నాదనీరాజనం వేదికపై సాంస్కృతిక శోభ‌


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నాదనీరాజనం వేదికపై సాంస్కృతిక శోభ‌

సెప్టెంబరు 18, తిరుమల 2018: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జరిగిన ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను అల‌రించాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 5 నుండి 5.30 గంటల వరకు శ్రీ కె.ర‌విప్ర‌భ‌, శ్రీ సుబ్ర‌మ‌ణ్యం బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎం.రాజ‌శేఖ‌ర్ బృందం విష్ణుసహస్రనామం, ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ అజ‌య్ ఆచార్య ధార్మికోపన్యాసం చేశారు.

మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు కేర‌ళ‌కు చెందిన సూర్య‌గాయ‌త్రి బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ కోవై ఎస్‌.జ‌య‌రామ‌న్ బృందం నామసంకీర్తన, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ఎస్వీ సంగీత క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ వై.వేంక‌టేశ్వ‌ర్లు భాగ‌వ‌తార్ హ‌రికథ పారాయణం చేశారు.

అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో మంగ‌ళ‌వారం ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు బెంగ‌ళూరుకు చెందిన శ్రీ‌కంఠ భ‌ట్‌ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.