PARUVETA UTSAVAM HELD IN GOVINDA RAJA SWAMY TEMPLE_ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

Tirupati, 19 October 2018: Adhika Masa Paruveta Utsavam was held in Sri Govinda Raja Swamy temple on Friday.

Usually this fete is observed on Kanuma day. The Lord was taken to Paruveta Mandapam located in Renigunta. Local devotees converged in large numbers to witness the mock hunt festival.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుపతి, 2018 అక్టోబరు 18: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి పార్వేట ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ పండుగనాడు జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసం కారణంగా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా సాయంత్రం 5.00 గంటలకు అశ్వవాహనంపై శ్రీగోవిందరాజస్వామివారు ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళ్ళరు. అక్కడ ఆస్థానం నిర్వహించారు. తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులు రాత్రి 8.30 గంటలకు ఆలయానికి చేరుకున్నారు.

ఘనంగా ముగిసిన శ్రీ వేదాంత దేశికర్‌ సాలకట్ల ఉత్సవం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీవేదాంత దేశికర్‌ ఆలయంలో అక్టోబర్‌ 9వ తేదీ నుండి నిర్వహిస్తున్న సాలకట్ల ఉత్సవం గురువారం ఘనంగా ముగిసింది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఘంటా స్వరూపులు శ్రీవేదాంతదేశికర్‌. ఈయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీవేదాంత దేశికర్‌ ఆలయానికి వేంచేపు చేస్తారు. ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు, శ్రీ వేదాంత దేశికర్‌ ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, తిరుప్పావై, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.

అనంతరం సాయంత్రం 8.00 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పా పడిని ఊరేగింపుగా తెచ్చి శ్రీ వేదాంత దేశికర్‌ వారికి సమర్పిస్తారు. రాత్రి 11.00 నుండి 12.30 గంటల వరకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు, శ్రీవేదాంత దేశికర్‌ ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

శ్రీవేంకటేశ్వరస్వామివారి జన్మించిన భాద్రపద మాసం శ్రవణా నక్షత్రంలోనే శ్రీవేదాంత దేశికర్‌ జన్మించారు. సుమారు 750 సంవత్సరాల క్రితం కాంచీపురంలోని తూప్పుల్‌ అగ్రహారంలో పుట్టారు. ఈయన స్వామివారిని కీర్తిస్తూ దయా శతకం అనే స్తోత్రం రచించారు. శ్రీవారి సుప్రభాతం రచించిన శ్రీ ప్రతివాద భయంకర అణ్ణన్‌కు శ్రీ వేదాంత దేశికర్‌ గురువర్యులు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికార ప్రముఖులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.