శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా స్నపనతిరుమంజనం


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతి, 18 నవంబరు 2017 ; తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిర్వహిస్తున్న స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) ప్రతిరోజూ శోభాయమానంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది.

ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ మణికంఠభట్టార్‌ ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం జరుగుతోంది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. ఇందులో కురువేరు(వట్టివేరులో ఒకరకం), వట్టివేరు, వివిధ రకాల ఎండు ఫలాలు, మూడు రంగుల రోజా పూలు, లిల్లీపూల మాలలు అమ్మవారికి అలంకరించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.