SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE BRAHMOTSAVAM CONCLUDES WITH CHAKRASNANAM _ వైభవంగా శ్రీ కల్యాణ వెంకన్న చక్రస్నానం
వైభవంగా శ్రీ కల్యాణ వెంకన్న చక్రస్నానం
తిరుపతి, మార్చి 9, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుండి 10.40 గంటల వరకు పుష్కరిణి పక్కనున్న మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.
ఈ సందర్భంగా తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అన్ని విభాగాల అధికారులకు, ఉద్యోగులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాత్రి 6.30 నుండి 7.30 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం, 7.30 నుండి 8.00 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్కుమార్, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
మార్చి 10న శ్రీవారి ఆభరణాల శోభాయాత్ర
మార్చి 11 నుండి 19వ తేదీ వరకు జరుగనున్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి అలంకరించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలను తీసుకురానున్నారు. ఈ ఆభరణాలు ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకోనున్నాయి. అక్కడి నుండి ఎస్వీ మెడికల్ కళాశాల, పాత మెటర్నిటీ ఆసుపత్రి సర్కిల్(కోమలమ్మ సత్రం) మీదుగా శ్రీ కోదండరామాలయానికి ఆభరణాల శోభాయాత్ర సాగుతుంది. ఈ కార్యక్రమంలో పురప్రజలు, భక్తులు, తితిదే ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేయడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.