జూన్ 28 నుండి 30వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
జూన్ 28 నుండి 30వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
తిరుపతి, 2017 జూన్ 23: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 28 నుండి 30వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా జరగనున్నాయ. ఈ సందర్భంగా జూన్ 27వ తేదీ ఉదయం 6.00 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజలసేవ ఘనంగా నిర్వహిస్తారు. జూన్ 28వ తేదీ రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు తిరుచ్చిపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. జూన్ 29వ తేదీ గురువారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
జూన్ 30వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజలసేవ జరగనున్నాయ. రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు శ్రీవారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ సందర్భంగా టిటిటి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జూలై 1న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేటి ఉత్సవం :
జూలై 1వ తేదీ శనివారం స్వామివారి పార్వేటి ఉత్సవం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీవారి మెట్టుకు సమీపంలోని పార్వేటి మండపానికి చేరుకుంటారు. ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ప్రత్యేక ఆస్థానం, పార్వేటి ఉత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు స్వామివారు పార్వేటి మండపం నుండి తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.